22, ఏప్రిల్ 2009, బుధవారం

జ్వరంలో పాణిగ్రహణం!

By kadambari piduri, Apr 5 2009 5:21PM

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య 1889 జూన్ లోకృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులో జన్మించారు. అప్పటి దాకా కందుకూరి వీరేశ లింగము మున్నగు వారి సంఘ సంస్కరణలలో వన్నె కెక్కిన ఆంధ్ర దేశము, స్వాతంత్ర్య పోరాటములో కూడా దీటు లేనిదనే ఖ్యాతిని గాంచినది. 

సరే! వారి జీవితములో ఒక హాస్య సంఘటన తాలూకు "రిమ రిమల"ను జ్ఞప్తికి తెచ్చుకుందాము. 

ఒక సారి గోపాల క్రిష్ణయ్య గారికి జ్వరం వచ్చింది. కుశల మడగుదామని దువ్వూరి సుబ్బమ్మ గారు వచ్చారు. ఆమె కూడా స్వాతంత్ర్య సాధనకై పోరాట రంగములోనికి ప్రవేశించిన అలనాటి నారీ శిరో మణి. జ్వర తీవ్రతతో "హా హా హూ హూ " అంటూ తెగ వణికి పోతున్నారు ఆ రామదండు నేత. 

"ఏమిటీ? జ్వరం ఎక్కువగా ఉన్నదా? ఏదీ చూస్తాను!" అంటూ చేయి పట్టుకుని నాడిని చూడసాగారు సుబ్బమ్మగారు. అంత జ్వరంలోనూ "అసలే జ్వరంతో బాధ పడుతూంటే మధ్యలో పాణి గ్రహణము కూడానా!" అని ఛలోక్తిని విసిరారు దుగ్గిరాల. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి